
న్యూఢిల్లీ, మే 18:
ప్రపంచంలోనే పాపులర్ మ్యూజిక్ సేవలను అందిస్తున్న యూ ట్యూబ్ కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఆన్లైన్ మ్యూజిక్ సెక్టార్లో పెరుగుతున్న పోటీని క్యాష్ చేసుకునే వ్యూహంలో ఈ నెల 22న దీన్ని అధికారికంగా లాంచ్ చేయనుంది.
ముఖ్యంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ రంగంలో మార్కెట్లను ఏలుతున్న ఆపిల్ మ్యూజిక్, స్పాటీఫై, సావన్ లాంటి సంస్థలకు పోటీగా తాజా యూ ట్యూబ్ మ్యూజిక్, యూ ట్యూబ్ ప్రీమియం అనే రెండు సర్వీసులను లాంచ్ చేయనుంది.
తద్వారా ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్నసేవలను సభ్యత్వ ఆధారిత సేవలుగా మారుస్తోంది. మ్యూజిక్ సేవలను రీబ్రాండింగ్ చేయడం ద్వారా ప్రత్యర్థి సంస్థలకు సవాల్ విసురుతోంది.
ఇక యూట్యూబ్ తెస్తున్న ఈ సేవలకు ఇతర సంస్థలు తట్టుకోగలవా అని నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యూట్యూబ్ సంస్థ తీసుకువస్తున్న యూ ట్యూబ్ మ్యూజిక్లో కేవలం ఆడియో మాత్రమే ప్లే అయ్యే విధంగా ప్లాన్ చేసింది.
దీంతో బ్యాండ్విడ్త్ ఆదా అవుతుందని సంస్థ భావిస్తోంది. అలాగే కేవలం యూట్యూబ్ లో ఉన్న వీడియోలు మాత్రమే కాదు, ఇతర పెద్ద మ్యూజిక్ కంపెనీల నుండి మ్యూజిక్ స్ట్రీమింగ్ చేయడం కోసం యూట్యూబ్ సంస్థ హక్కులను కొనుగోలు చేసింది.
అంటే ఆ పాటలన్నింటిని ఈ సర్వీస్ ద్వారా ప్లే చేసుకుని వినవచ్చన్నమాట. అయితే ఇందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెలకు సుమారు 680 రూపాయలు (10-12 డాలర్లు) ఖర్చు పెట్టవలసి ఉంటుంది.
ఇక యూ ట్యూబ్ వీడియోను యాడ్ ఫ్రీగా వీక్షించాలనుకునే వారినుద్దేశించి తీసుకొస్తున్న మరో ఆప్షన్ ప్రీమియం సర్వీసు. ఈ సర్వీసు కూడా సబ్స్క్రిప్షన్ ఆధారంగానే పనిచేస్తుంది.
అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మెక్సికో, దక్షిణ కొరియాలో ఈ సేవలను మొదటగా ప్రారంభిస్తుంది. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా ఆవిష్కరించనుంది.
ఇది వరకు ఏ సంస్థలో పాటలు వినాలి అనుకుంటే ఆ సంస్థ అధికారిక వెబ్సైట్ ను వీక్షించాలి. కొన్ని కొన్ని గీతాల కోసం కొన్ని కొన్ని సంస్థల అంతర్జాల పేజీలను వీక్షంచాలి.
కానీ యూట్యూబ్ ఈ సారి సరికొత్తగా అన్నీ సంస్థల సేవలను ఏకధాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఈ ప్రయత్నం మన పాటల ప్రియులను ఎంతగా అలరిస్తుందో త్వరలో తెలియనుంది.
మామాట: యూట్యూబ్ సేవలు అభినందనీయం.