అలంపూర్, అక్టోబర్ 4:
గురువారం జోగులాంబ గద్వాల నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కేసీఆర్పై విమర్శల దాడి చేశారు. నిన్ననిజామాబాద్ వేదికగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై చేసిన విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొట్టారు.
మహాకూటమిని విమర్శిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గతంలో టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అబద్ధపు కూతలు కూస్తున్నారని, 24 గంటల కరెంట్ ఇస్తే టీఆర్ఎస్కి ప్రచారం చేస్తానని అనలేదని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని జానారెడ్డి సవాల్ విసిరారు.
కేసీఆర్కు మరో ఐదేళ్లు అవకాశమిస్తే దోచుకుంటారని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు గల కారణాలను ఇంతవరకు కేసీఆర్ చెప్పలేదని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విజయశాంతి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం గజదొంగల్లా దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని వాళ్లను హైదరాబాద్ లో ‘బట్టేబాజ్’ అంటారని అన్నారు. మరో నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి దొరలను కాంగ్రెస్ పార్టీ తరిమికొట్టిందని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు తామేమీ భయపడమని స్పష్టం చేశారు.
ఇక కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, తన గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా కేసీఆర్కు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణను వ్యతరేకించిన వారందరినీ మంత్రివర్గంలోకి తీసుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ జతకడతారని అన్నారు.
మామాట: మీరు కేసీఆర్ని గట్టిగానే టార్గెట్ చేసినట్లున్నారు….