పాట్నా:
సొంతగడ్డపై వరుసగా కూటముల పాలవుతున్న పాట్నా పైరేట్స్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. స్టార్ రైడర్, డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ విజృంభించడంతో పాట్నా 41-20తో యూపీ యోధాను చిత్తు చేసింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో పైరేట్స్కు ఇది మూడో విజయం.
అయితే మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం కనబర్చిన పాట్నా చివరి వరకు అదే జోరు కొనసాగించింది. రైడింగ్లో పాట్నాకు కాస్త పోటీ ఇవ్వగలిగిన యోధా.. ట్యాక్లింగ్లో మాత్రం పూర్తిగా విఫలమైంది. మ్యాచ్ మొత్తంలో పైరేట్స్16 ట్యాకిల్ పాయింట్లు సాధిస్తే.. యూపీ 4 పాయింట్లతోనే సరిపెట్టుకుంది.
మొత్తానికి పాట్నా కెప్టెన్ పర్దీప్ 12 పాయింట్లతో చెలరేగితే.. నీరజ్ కుమార్ (8 పాయింట్లు), జాంగ్ కున్ లీ (5 పాయింట్లు) ఆకట్టుకున్నారు. యూపీ తరఫున మోనూ గోయత్ (4 పాయింట్లు) నిరాశ పరచడం ఫలితంపై ప్రభావం చూపింది.
ఇక తొలి పది నిమిషాల ఆట పూర్తయ్యేసరికే పాట్నా 11-3తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. హాఫ్ టైమ్కు ముందే యూపీ జట్టు రెండు సార్లు ఆలౌట్ కావడంతో అర్ధభాగం ముగిసే సమయానికి పాట్నా 24-9తో ముందంజలో నిలిచింది.
రెండో సగంలోనూ చక్కటి ప్రదర్శన కనబర్చిన పైరేట్స్ మరోసారి ప్రత్యర్థిని ఆలౌట్ చేసి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32-30తో యూ ముంబాపై గెలిచింది.