తిరుపతి, సెప్టెంబర్ 4
రాజకీయాల్లో అవకాశాలను అంది పుచ్చుకోవాలి, వెనుకబడితే వెనుకేనోయ్ అని మహాకవి అన్నట్టు… పదవీ పరుగులో అలసట ఎరుగకుండా, పరుగుతీయాలి, పక్కనున్నవారిని తొలగిపోవాలి. అపుడే విజయలక్ష్మి చేజిక్కుతుంది.. అందుకు ముందు చూపుండాలి.. మందు చూపు కాదు… ఈ ముగ్గురినీ చూడండి.. రాజకీయ పావులను ఎలా కదుపుతున్నారో… ఎప్పుడో వెలిగే లైట్ కోసం ఇపుడే స్విచ్ వేస్తున్నారు…
ముందస్తు వ్యూహం ఒకరిది.. ఇన్నాళ్లూ దూరంగా ఉంచిన కుటుంబాన్ని అక్కున చేర్చుకుని ఆదరించాననే సింపథీ ప్రజల్లో తెచ్చుకోవాలనే ప్రణాళిక మరొకరిది. ఒక కుటుంబంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకింత ప్రేమ చూపుతున్నారు. ఆ కుటుంబంలోని వ్యక్తి మరణిస్తే.. ఒకరు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మరొకరు.. చివరి కార్యక్రమాలు ముగిసే వరకూ అన్నీ ముందుండి నడిపించారు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, బంధు ప్రీతి.. వంటివన్నీ ఆ కుటుంబంపై ఇద్దరు చంద్రులకు లేవని చెప్పలేం. కానీ ఒక్కసారిగా ఎనలేని ప్రేమ కురిపిస్తుంటడమే అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే కాదు.. అటు దేశంలోనూ ఇదే తరహా రాజకీయాలు కనిపిస్తున్నాయి.
కురువృద్ధుడు, మాజీ ప్రధాని వాజ్పేయ్ మరణం, ఇటు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ మృతి తర్వాత.. జరిగిన పరిమాణాలు కొత్త తరహా రాజకీయాలను ప్రజలకు పరిచయం చేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు అందుకుంటారు. ఏ రంగంలోనైనా ఇదే ప్రాథమిక సూత్రం. రాజకీయాల్లో నేతలు దీనిని మరింతగా గుర్తుంచుకోవాలి. మరి రాజకీయ వ్యూహాల్లో కాకలు తీరిన యోధుల్లాంటి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ.. ఈ సూత్రాన్ని అమలు పరిచే సమయం కోసం వేచిచూస్తూ ఉంటారు. నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో.. ఆయన అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు బాసటగా నిలవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బావమరిదిపై ప్రేమ చంద్రబాబుకు లేదని అనలేకున్నా.. ఇప్పుడే గుర్తుకువచ్చారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసి డిసెంబరులోనే ఎన్నికలకు వెళతారనే చర్చ మరింత అధికమవుతోంది. ఇప్పటికే అన్ని వర్గాల ఓటర్లపై ఎన్నోవరాల జల్లులు కురిపిస్తున్న కేసీఆర్.. దృష్టి కమ్మ సామాజిక వర్గం, సెటిలర్లపై పడింది. వీరి మద్దతు పొందేందుకు వ్యూహాలు రచించారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే అధికారిక లాంఛనాలతో నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించేలా ప్లాన్ చేశారనే విశ్లేషణలు జోరందుకున్నాయి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చూసుకున్నారు. అంతేగాక ఎన్నడూ లేని విధంగా హరికృష్ణ పాడె కూడా మోశారు. ఇన్నాళ్లూ హరికృష్ణ కుటుంబాన్ని దూరంగా ఉంచి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే! దీంతో ఎంతైనా సానుభూతి వర్కవుట్ చేసుకోవచ్చనేది వీరి వ్యూహమనే వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక దేశ రాజకీయాల్లోనూ ఇలాంటి పరిస్థితే.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ మృతి.. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ కూడా కొంత ఉత్సుకత చూపారు. ఒకపక్క మరో కురు వృద్ధుడు ఎల్కే అద్వానీని పక్కన పెట్టి.. సముచిత గౌరవం ఇవ్వడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు మోడీ. ఈ సమయంలో వాజ్పేయ్ చనిపోతే.. ఆయన అభిమానుల సింపథీ కోసం హడావుడి చేశారు. కిలోమీటర్లు వాజ్ పేయి పార్థీవ దేహం వెంట నడిచారు. దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు తీవ్రంగా వీస్తున్నాయి. ఈ తరుణంలో వాజ్పేయ్ అంతిమ యాత్రలో దాదాపు ఏడు కిలోమీటర్లు నడవడం కొంత ఆశ్చర్యం కలిగించక మానదు. సో ఇది సింపథీ రాజకీయాల కాలంగా భావిద్దాం.
బాబుకు గుబులు పుట్టిస్తున్న రాయలసీమ
రాజకీయంగా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అయితే చెప్పనక్కర లేదు. కర్నూలులో ఏ నియోజకవర్గం చూసినా నేతలు సఖ్యతగా లేరు. ఇక బలంలేని కడపలో కూడా నేతలది తలోదారి. అనంతపురం జిల్లాలో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో జనం దెబ్బేస్తే అధికారంలోకి రావడం సాధ్యం కాదని భావించిన చంద్రబాబు ఇకపై ఆ జిల్లాల్లో ఎక్కువగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు తమ్ముళ్ల మధ్య తగవులను తీర్చే పనిలో పడ్డారు. ఇటీవల ఒకే రోజు కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నేతల మధ్య సఖ్యత తెచ్చేందుకు ప్రయత్నించారు.రాయలసీమలో వైసీపీకి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో అనంతపురం మినహా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ గాలులు వీచాయి. వచ్చే ఎన్నికల్లోనూ రాయలసీమలో జగన్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్రపట్టనివ్వడం లేదు.
ఇప్పటికే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతిదీ అమరావతిని బూచిగా చూపించి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. కియో కార్ల ఫ్యాక్టరీ, పులివెందులకు నీళ్లు తెప్పించామని చెప్పడం తప్ప రాయలసీమకు టీడీపీ సర్కార్ చేసిందేమీ లేదన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేల్లో కూడా గతంలో కంటే ఈసారి సీమ జిల్లాల్లో టీడీపీకి సీట్లు తగ్గుతాయన్న ఫలితాలు రావడంతో చంద్రబాబు జగన్ ను అన్ని విధాలుగా ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు.ఇక రాయలసీమలోనూ కాంగ్రెస్ పార్టీకి కొంత పట్టుంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కాంగ్రెస్ ప్రముఖ నేతలు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. కర్నూలులో కోట్ల కుటుంబం, అనంతలో రఘువీరారెడ్డి, చిత్తూరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఉన్నారు. వారికి పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వైసీపీ ఓట్లను చీల్చడానికి కాంగ్రెస్ నేతలు కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా పర్యటించేలా చంద్రబాబు లోపాయికారీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తే కొంతవరకూ జగన్ ఓట్లు చీల్చగలరన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు.
ఇక కర్నూలులో కాంగ్రెస్ నేతలు రాహుల్ సభ పెట్టడానికి కూడా ఇదే కారణమంటున్నారు. రాహుల్ ను పట్టుబట్టి కర్నూలు సభకు ఒప్పించింది అందుకేనని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటం, ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగుతుండటంతో రాహుల్ బిజీగా ఉన్నారు. ఆయనను రాష్ట్రానికి తీసుకురాదలచుకుంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి తదితర పట్టణాలను ఎంపిక చేయవచ్చు. అక్కడ ఎయిర్ పోర్టులు కూడా ఉండటంతో రాహుల్ సులువగా గంటల్లోనే హస్తినకు వెళ్లిపోయే వీలుంది. కాని కర్నూలు సభకు తీసుకురావడం వెనక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రధాన కారణమైన దాని వెనక చంద్రబాబు ఉన్నారన్నది కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. వైసీపీ నేతలు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ కర్నూలు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేయడంతో పాటు, మోదీ, జగన్ లపై విరుచుకుపడితే అది తమకు లాభిస్తుందన్నది తెలుగుదేశం అంచనాగా ఉంది. మరి రాహుల్ పర్యటన టీడీపీకి లాభిస్తుందా? కాంగ్రెస్ కు కలిసొస్తుందా? జగన్ ఓటు బ్యాంకు చెక్కు చెదరదా? అన్నది తేలాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.
మామాట : చదరంగం అంటే ఎత్తులు వేయడం… రాజకీయం అంటే పై ఎత్తువేయడం