
హైదరాబాద్, 9 ఫిబ్రవరి:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు.
కానీ అధిష్టానం మహబూబ్ నగర్ నుండి కాకుండా ఖమ్మం నుండి బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ ఆలోచన కూడా మారినట్లు తెలుస్తోంది.
ఒకవేళ రేవంత్ ఖమ్మం బరిలో దిగితే విజయం ఖాయమని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. అందులోనూ మొన్న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రమంతా టిఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న ఒక ఖమ్మం జిల్లాలో మాత్రం ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఖమ్మం లో మహా కూటమి మొత్తం పది సీట్లలో 8 సీట్లను గెలుచుకుంది. టిఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. గెలిచిన ఒక ఇండిపెండెంట్ టీఆర్ఎస్లో చేరారు.
అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలను రంగంలోకి దింపితే వర్గపోరు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపితే టీడీపీ క్యాడర్ కూడా పూర్తిగా సహకరిస్తుంది. దీంతో ఖమ్మం సీట్ కాంగ్రెస్ గెలవడం ఖాయమే.
మరోవైపు ఇక్కడ టిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి బరిలో ఉండే అవకాశం ఉంది. మరి ఎన్నికల నాటికి ఏ అభ్యర్ధులు ఖమ్మం బరిలో ఉంటారో చూడాలి.
మామాట: మరి ఖమ్మం బరిలో నిలిచేదెవరో..గెలిచేదెవరో