విజయవాడ, సెప్టెంబర్ 05:
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి ఆహ్వానించాలన్న ఆలోచనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికలు టీడీపీకి చావోరేవో తేల్చేవి కావటం.. బలమైన విపక్షం ఉన్న నేపథ్యంలో జూనియర్ను తమ వైపునకు ఉంచుకుంటే ఎన్నికల ప్రచారానికి తురుపు ముక్కగా మారతారన్న ఆలోచనలో బాబు ఉన్నట్లు సమాచారం.
ఈ మధ్యకాలంలో హరికృష్ణను బాబు దూరం పెట్టిన వైనం తెలిసిందే. ఇటీవల జరిగిన మహానాడుకు ఆయనకు ఆహ్వానం కూడా పంపని విషయం తెలిసిందే. దీంతో.. బాబు.. హరికృష్ణ మధ్య దూరం పెరిగిందని చెబుతారు. ఇదిలా ఉంటే.. అనుకోని రీతిలో మరణించిన హరికృష్ణతో విషాదంలో మునిగిన కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి మరీ అంతిమసంస్కారాల్ని నిర్వహించారు.
హరికృష్ణ ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇవ్వని బాబు.. మరణించిన తర్వాత మాత్రం భారీ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పలువురు చర్చించుకుంటున్నారు. అంత్యక్రియలు జరిగే వరకూ నిత్యం రెండు..మూడుసార్లు జూనియర్ ఎన్టీఆర్ (తారక్)తో మాట్లాడేవారని.. సలహాలు.. సూచనలు చేసేవారని.. అంత్యక్రియల్ని ఆయనే దగ్గరుండి చేయించినట్లుగా తెలుస్తోంది.
హరికృష్ణతో తనకున్న విభేదాలకు చెక్ పెట్టేలా బాబు తాజా అడుగులు ఉన్నాయని చెబుతున్నారు. అంత్యక్రియల దగ్గర నుంచి పలు సందర్భాల్లో చంద్రబాబు ముందుండి కార్యక్రమాన్ని నడిపించటం చేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకోవటం ద్వారా నందమూరి కుటుంబం టీడీపీతో కలిసి ఉందన్న భావన కలిగేందుకు తోడ్పడుతుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే ఎన్టీఆర్ను పార్టీలోకి ఆహ్వానించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఒకవేళ ఈ అంశంపై బాబు నిర్ణయం తీసుకొని.. ఎన్టీఆర్ను పొలిట్ బ్యూరోకి రమ్మంటే ఎన్టీఆర్ వచ్చే పరిస్థితి ఉందన్న మాట పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు పార్టీలోకి రావాలన్న ఆలోచనలో లేరన్న మాట వినిపిస్తోంది. గతంలో ఒకసారి వచ్చి దెబ్బ తిన్నానని.. ఈసారి కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆలోచిద్దామని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి ఎన్టీఆర్ కారణంగా లాభం చేకూరుతుందన్న విషయం తారక్కు అవగాహన ఉంటే బెట్టు చేసే వీలుందని అంటున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్పై టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోందని చెప్పక తప్పదు.
మామాట: ఇప్పుడు ఎన్టీఆర్ మద్ధతు టీడీపీ అవసరమే అనుకుంటా…!