హైదరాబాద్, 10 సెప్టెంబర్:
తదుపరి ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఆశపడి టిఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్కు తొలి విడుతలో టికెట్ దక్కకపోయే సరికి ఆయన అసంతృప్తి చెందిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్నో మంతనాల తర్వాత ఎట్టకేలకు దానంకు లైన్ క్లియర్ అయింది. కేసీఆర్ హైదరాబాద్ గోషామహల్ సీటును దానంకు కేటాయించినట్టు విశ్వసనీయ్ వర్గాల సమాచారం. అయితే ఈ విషయాన్ని 13వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారట.
ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్ పేరు టీఆర్ఎస్ తొలి జాబితాలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో రహస్యంగా భేటీ అయినట్టు కూడా వార్తలు కూడా వచ్చాయి.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించిన కేసీఆర్ దానికి సరైన వ్యక్తి దానం అని నిర్ధారించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారట.
మామాట: ఇంకే దానం లైన్ క్లియర్ అయినట్టే…