‘వ్యాక్సీన్ కాపిటల్ ఆఫ్ ది వరల్డ్’… హైదరాబాద్
కోవిడ్-19 కల్లోలానికి ఊపిరాడక సతమతం అవుతున్న సమయాన ప్రపంచ మానవాళికి వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం శుభపరిణామం. కరోనా సవాళ్ళను అవకాశాలుగా మలుచుకుని ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు టీకాలను కనుగొని ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తున్నాయి. భారత్ లోని హైదరాబాద్ ఫార్మా కంపెనీలు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలతో తీవ్ర వ్యాధులు ప్రబలినపుడు క్రియాశీలత గల టీకాను అతి తక్కువ ధరలకు అందించడంలో అనేక సార్లు సఫలమైనాయని చరిత్ర చెబుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా కోవిడ్-19 ఔషధాలు రెమ్డెసివిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫవీపిరవిర్ వంటివి ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
కోవిడ్-19ను నిరోధించే టీకాను దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయడానికి భారత్ కేగాక ప్రపంచ దేశాలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. ఇండియాలో కోవిడ్ టీకాలను రూపొందించడానికి కృషి చేస్తున్న 6 కంపెనీలలో 4 కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఐసియంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో దేశీయ పరిజ్ఞానంతో హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ అతి పెద్ద 3వ దశ క్లినికల్ ట్రయల్స్ 26,000 వాలంటీర్లతో పూర్తి చేసే దశలో ఉంది. ఈ సంస్థ సిద్ధంచేసిన ‘కోవాక్సీన్’ టీకాకు ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. కోవాక్సీన్ టీకా సరఫరాకు విదేశాలు కూడా క్యూ కట్టడం విశేషం.
భారత్ బయోటెక్ కంపెనీ ఏప్రిల్-2021లో ‘కోరోఫ్లూ’ ఇంట్రానాసల్ కరోనా వ్యాక్సీన్ 300 మిలియన్ డోసులు తీసుకువస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 140 ప్రపంచ పేటెంట్లు, 16 వ్యాక్సీన్లు, 4 బయో- థెరాప్టిక్స్, దాదాపు 116 దేశాల రిజిస్ట్రేషన్లు పొందిన చరిత్ర హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కంపెనీకి ఉంది. భారత్ బయోటెక్ తయారుచేసిన హెచ్1యన్1, రోటావైరస్, జపనీస్ ఎన్సిఫిలైటిస్, రాబిస్, చికెన్గున్యా, జీకా, టైఫాయిడ్ వ్యాక్సీన్లను విశేషంగా వినియోగిస్తున్నారు. హైదరాబాద్లోని ‘బయోలాజికల్ ఈ’ కంపెనీ కూడా కోవిడ్-19 సబ్యూనిట్ వ్యాక్సీన్ తయారీకి డిసిజిఐ అనుమతులు పొందింది.
నగరంలోని రెడ్డి ల్యాబ్స్ కూడా రష్యా కోవిడ్-19 వ్యాక్సీన్ స్పుత్నిక్-వి క్లినికల్ ట్రయల్స్ ప్రయోగాలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్ కేంద్రంగా రూపొందుతున్న కరోనా వ్యాక్సీన్ ప్రయోగాల ప్రగతిన పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నగరం సందర్శించడం విశేషం. ఫైజర్- బయో యన్టెక్ కంపెనీలు రూపొందించిన ‘బియన్టి 162బి2’ కరోనా టీకాను బ్రిటన్ కు సరఫరా ప్రారంభం కావడం గర్వకారణమే. ఆస్ట్రాజెనెకా-ఆక్సఫర్డ్ కరోనా వ్యాక్సీన్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.
ప్రపంచ వ్యాక్సీన్ల తయారీలో 33 శాతం, అంటే 2 బిలియన్ డోసులు హైదరాబాద్ కంపెనీలు అందిస్తున్నాయి. దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ 50 శాతం బల్క్ డ్రగ్ ఎగుమతులు హైదరాబాద్ నుండే జరగడం విశేషం. హైదరాబాద్ చుట్టు పక్కల 800 పైగా లైఫ్ సైన్స్ కంపెనీలు, 20 ఇంక్యుబేషన్ సెంటర్లు, 200 పైగా స్టార్ట్అప్లు, 200 పైగా అంతర్జాతీయ కంపెనీ (నోవార్టిస్, గ్లాస్కోస్మిత్క్లైమ్, ఫెర్రీ ఫార్మా, కెమో, డ్యూపాంట్, ఆష్లాండ్, యూయస్ ఫార్మకోపియా, లోంజా లాంటి) శాఖలలో దాదాపు 1,20,000 ఫార్మా ప్రొఫెషనల్స్ సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లో 600 ఘనపు కిమీ పరిధిలో ప్రపంచ స్థాయి వసతులతో ‘జీనోమ్ వ్యాలీ’ని 1999లో నెలకొల్పారు. దీనికి అదనంగా హైదరాబాద్ ఫార్మా సిటీకూడా త్వరలో ఆవిష్కారం కానుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా 1.7 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 5.6 లక్షల పరోక్ష ఉద్యోగ ఉపాధులు రానున్నాయని అంచనా .
భారత్ బయోటెక్, బయలాజికల్ ఈ, అరబిందో ఫార్మా, రెడ్డి ల్యాబ్స్, హెటరో డ్రగ్స్, శాంత బయోటెక్ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి కంపెనీలు అవసరాన్ని బట్టి టీకాను తయారు చేసి సరసమైన ధరలకు అందిస్తున్నాయి. శాంత బయోటెక్ కంపెనీ 1980ల్లో హెపటైటిస్-బి, రీకాంబినంట్ డియన్ఏ వంటి పలు వ్యాక్సీన్లు ప్రపంచ దేశాలకు అందుబాటు లోకి తేవడం మనకు గర్వకారణం. భారతీయ ప్రముఖ పరిశోధనా సంస్థ సిసియంబి- (హైదరాబాద్) కూడా కరోనా వ్యాక్సీన్ తయారీలో నిమగ్నమయింది. కోవిడ్-19 వ్యాక్సీన్ తయారీ కేంద్రాల పరిశోధనలను ప్రత్యక్షంగా పరిశీలించడానికి 64 విదేశీ ప్రతినిధులు హైదరాబాద్కు రావడం, టీకా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేయడం సంతోషదాయకం. భవిష్యత్తులో ప్రపంచదేశాలకు హైదరాబాద్ మహానగరం వాక్సిన్ కేంద్రంగా విరాజిల్లడం మనం చూడబోతున్నాం.
-ఎన్నార్కె