అమరావతి, సెప్టెంబర్ 10
తెలుగుదేశం పార్టీ రాజధాని పేరుతో మోసాలు చేస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.
అమరావతిలో ఎమ్మెల్యేల నివాసాలు ఎక్కడ నిర్మించారో మాకు కనిపించడం లేదనీ, నివాసాలు నిర్మించామని నిధులు తీసుకున్నారనీ శాసనమండలి అబద్ధాల సభకు నిలయంగా మారిందని వీర్రాజు ఆరోపించారు.
సోమవారం అసెంబ్లీ మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రరాష్ట్రాన్ని విభజించడానికి మీరు సహకరించ లేదా? అని టీడీపీనీ ప్రశ్నించారు. నీతి లేని,నిజాయితిలు లేని అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంద్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ ఎంపీలు ప్రశ్నించారా? అరిగిపోయిన రికార్డులాగా రాజధాని అని పదే పదే అమరావతి పేరు చెప్తున్నారని అన్నారు.
“రాజధానికి 1500కోట్లు ఇస్తే కారిపోతున్న తాత్కాలిక రాజధాని కట్టారు. శాసనసభ,శాసనమండలిలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సభ్యులు ప్రశ్నిస్తుంటే ముప్పేట దాడి చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. నిర్మాణం చెయ్యని రాజధానికి అసెంబ్లీలో డబ్బా కోట్టుకుంటున్నారనీ, రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుందని అన్నారు.
దేశంలో విడిపోయిన రాష్ట్రాలు అన్ని తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించాయి. బీజేపీ,టీడీపీ కలిసి ఉన్నప్పుడు పొగుడుతూ తీర్మానాలు చేశారు. విడిపోయాక సభలో మోడీని తిడుతూన్నారని ఆయన మండిపడ్డారు.
కేంద్రం ఇచ్చిన 32వేల కోట్ల రూపాయల ఎన్ఆర్జిఈఎస్ నిధులను టీడీపీ నేతలు మింగేశారని ఆరోపించారు. డ్రైనేజీలు కట్టడానికి కేంద్రం 1000కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేక పోయిందన్నారు.
హైదరాబాద్లో చేసిన తప్పు అమరావతిలో చేస్తున్నారన్నారు. “రాజధాని నిర్మాణం మీకు చేతకాకపోతే మాకు ఇవ్వండి మేము నిర్మించి చూపిస్తాం” అని సవాల్ విసిరారు.
రాజధాని పేరుతో విదేశీ సంస్థలకు భూములు దోచి పెడుతున్నారనీ, సభలో బీజేపీ సబ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కాబట్టే సభ నుంచి వాక్ ఔట్ చేస్తున్నామని ఆయన అన్నారు.
మామాట: మరి దీనికి టీడీపీ వర్గాల సమాధానం ఏమిటో….