కొత్త ఢిల్లీ, ఆగష్టు 16,
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట పై నుంచీ ప్రధాని నరేంద్ర మోదీ నిన్న పేదలకు ఆరోగ్య రక్షణనిచ్చే ఆరోగ్య అభియాస్ పథకాన్ని ప్రకటించారు. మొదటి దశలో ఈ పథకాన్ని చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయూ, నాగాలాండ్, మణిపూర్, హర్యాణా, ఆంధ్రప్రదేశ్ లలో చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేర్ పాలసీ ఆధ్వర్యంలో ఇది అమలవుతుంది. ఇప్పటి వరకు 29 రాష్ట్రాలు ఈ పథకానికి అంగీకరించాయి. అయితే ఒడిశా రాష్ట్రం మాత్రం ఈ పథకం తమకు వద్దని స్పష్టం చేసింది.
ఏమిటీ పథకం ?
ప్రతి కటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల మేర నగదు రహిత వైద్య బీమా ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. దేశ వ్యాప్తంగా సుమారు 10 కోట్ల కుటుంబాలు ఈ పథకం కిందకు రానున్నాయి.
ఈ పథకం వేటిని కవర్ చేస్తుంది?
1,354 మెడికల్ – సర్జికల్ ప్యాకేజీలను ఈ స్కీం కవర్ చేస్తుంది. వీటిలో కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆంకాలజీ (50 రకాల క్యాన్సర్లకు కీమోథెరపీ), కాలిన గాయాలకు చికిత్స వంటి ఎన్నో ఈ స్కీం కిందకు వస్తాయి. అయితే లబ్దిదారులు సర్జికల్ మరియు మెడికల్ ప్యాకేజీలను ఒకేసారి వినియోగించుకోలేరు.
ప్రయోజనాలు..
చికిత్సకోసం వెళ్లినపుడు హాస్పిటల్ రిజిస్ట్రేషన్, నర్సింగ్, జనరల్ వార్డులో వసతి ఛార్జీలు భరించబడతాయి. కన్సల్టేషన్ ఫీజ్, సర్జికల్ వస్తువులు, ఇప్లాంట్స్, మందులు, డయాగ్నస్టిక్ టెస్టులు, పేషెంట్లకు ఆహారం ఇవ్వబడతాయి. ప్రీ మరియు పోస్ట్ హాస్పిటల్ ఖర్చులు కూడా చెల్లిస్తారు.
ఒకటి కంటే ఎక్కువ సర్జరీలు జరిగినప్పుడు… మెదటి ట్రీట్ మెంట్ సందర్భంగా ఎక్కువ ఖర్చు అయినదాన్ని లెక్కించరు. రెండో ట్రీట్ మెంట్ లో 50 శాతం, మూడో ట్రీట్ మెంట్ లో 25 శాతం ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంలో ఈ పథకం అమలౌతుంది.
ఆరోగ్య అభియాన్ అమలు బాధ్యత ఎవరిది?
కేంద్రప్రభుత్వ స్థాయి ..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి సంబంధించి వెబ్ పోర్టల్ కూడా ఉంటుంది.
రాష్ట్ర స్థాయి..
ఇన్స్యూరెన్స్ సంస్థలు, ఆసుపత్రులతో స్టేట్ హెల్త్ ఏజెన్సీలు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాయి. ఆసుపత్రులకు అవసరమైన వసతులు, ఐటీ సేవలు ఉన్నాయో, లేదో స్టేట్ హెల్త్ ఏజెన్సీలే పర్యవేక్షిస్తాయి. లబ్దిదారులను గుర్తించడం, ఈ-కార్డులను ప్రింట్ చేయడం, సేవలను అందించడం వంటి బాధ్యత కూడా ఈ ఏజెన్సీలదే.
జిల్లా స్థాయి..
రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న ఇన్స్యూరెన్స్ సంస్థ కాంట్రాక్టు కుదుర్చుకున్న 15 రోజుల్లోగా జిల్లాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమానికి చెందిన ఓ కమిటీ హాస్పిటళ్లను ఎంపిక చేస్తుంది. ఆ తర్వాత స్టేట్ హెల్త్ ఏజెన్సీ, ఇన్స్యూరెన్ సంస్థలు, హాస్పిటళ్ల మధ్య కాంట్రాక్ట్ కుదురుతుంది. ఈ పథకం కోసం 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 2000 కోట్లను కేటాయించింది.
ఆసుపత్రుల అర్హత?
ఈ పథకం పరిధిలోకి రావాలనుకునే ఆసుపత్రులకు కనీసం 10 ఇన్ పేషెంట్ బెడ్స్ ఉండాలి. సరిపడా స్థలం, నిపుణులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉండాలి. సర్జరీలను నిర్వహించే ఆసుపత్రులకు కనీసం 15 బెడ్స్ ఉండాలి. ఇప్పటికే ఈ స్కీం కోసం దేశ వ్యాప్తంగా 7,826 ఆసుపత్రులు రిజిస్టర్ చేసుకున్నాయి. వీటిలో 47 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు కావడం విశేషం.
మామాట : ఆరోగ్యమైన సమాజమే ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మిస్తుంది.