అమరావతి: ప్రతిపక్ష టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు.. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇంఛార్జ్ రామసుబ్బారెడ్డిలు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అలాగే పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ సతీష్రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు.. ఆయన కూడా త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరికి తోడు విశాఖ జిల్లా ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు కూడా తెలుగుదేశంకు గుడ్ బై చెప్పారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కలరణం బలరామకృష్ణమూర్తి పార్టీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైఎస్సార్సీపీ కండువా కప్పుకోకపోయినా.. తన కుమారుడ్ని మాత్రం పార్టీలో చేర్చారు.
తాజాగా అనంతపురం జిల్లాలో మరో ముఖ్య నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరు పార్టీకి రాజీనామా చేస్తారని జిల్లాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండు మూడురోజుల్లో అధికారికంగా ప్రకటన వస్తుందంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో తమ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేయడంపై చర్చించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే టీడీపీలో ఇన్ని పరిణామాలు జరుగుతున్న నందమూరి వారసుడు బాలయ్య మాత్రం ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ రెకమండ్తోనే చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చారని కూడా బాబురావు పలు సందర్భాల్లో చెప్పుకొన్నారు. తాను బాలకృష్ణను చూసే ఇన్ని రోజులు టీడీపీలో కొనసాగాననీ చెప్పుకొన్నారు. అలాంటి ఆప్తమిత్రుడు పార్టీని వీడిపోయారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. దీనిపై బాలకృష్ణ స్పందించడానికి నిరాకరిస్తున్నారు.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగిన నాయకులు మాజీమంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి. ఎన్టీ రామారావు పార్టీని స్థాపించినప్పటి నుంచీ కరణం బలరాం కొనసాగుతూ వచ్చారు. పునాదులు పడినప్పటి నుంచీ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన ఆ ఇద్దరు నాయకులు గుడ్బై చెప్పారు. దీనిపైనా బాలకృష్ణ పెదవి విప్పట్లేదు.