హైదరాబాద్, సెప్టెంబర్ 8:
మజ్లీస్ తమకు మిత్రపక్షమని కేసిఆర్ ప్రకటించి రెండు రోజులైనా కాలేదు. ఈ లోపే మజ్లీస్ నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకం అయ్యాయి.
తాజాగా హైదరాబాద్లోని మల్లేపల్లిలో మజ్లీస్ పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ కేసిఆర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖర్ రావు నవంబర్లో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్లో ఆయన ముఖ్యమంత్రి అవుతానని జోష్యం చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించే మాట్లాడిన అక్బరుద్దీన్ నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయి, కానీ డిసెంబర్లో సీఎం అవుతానని కేసిఆర్ ఎలా అంటున్నారంటూ ప్రశ్నించారు.
ఎన్నికలు జరిగాక డిసెంబర్లో ఏమైనా జరగొచ్చని, ఏం మజ్లీస్ నుండి ముఖ్యమంత్రిగా మేం కాలేమా అంటూ ప్రశ్నించారు. అసలు డిసెంబర్లో ఎవరి అవసరం ఎవరికి వస్తుందో చూద్దాం అంటూ ధీమా వ్యక్తం చేశారు.
“జేడిఎస్ నేత కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రి అయినప్పుడు మజ్లీస్ నుండి మనం ముఖ్యమంత్రిగా ఎందుకు అవ్వలేం? డిసెంబర్లో తెలంగాణలో మజ్లిస్ జెండా ఎగరేద్దాం.., ఎంఐఎం సత్తా చాటుదాం” అంటూ అక్బరుద్దీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మామాట: ఎంఐఎంకు కూడా సీఏం అయ్యే సత్తా ఉందా…?